బతకడానికి ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందామని, ప్రభుత్వ పథకాలకు ఎంతోమంది దరఖాస్తు చేసుకుంటారు. రుణం మంజూరైన వారికి బ్యాంకులు డబ్బులు చెల్లిస్తారు. కాని రుణం మంజూరైన కూడా రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయని లబ్దిదారులు ఆగ్రహంతో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా రుణాలు ఇవ్వకపోగా, సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ముందు చెత్తవేసి తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. రుణాల మంజూరు విషయంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ డా. ప్రకాశ్ పలుమార్లు ఆయా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని, అందుకే ఇలాంటి నిరసనకు దిగినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) స్పందించింది. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు చెత్త వేయడాన్ని ఏఐబీఈఏ తీవ్రంగా ఖండించింది. ఇలా బ్యాంకుల ముందు చెత్త వేయడం అరాచకానికి నిదర్శనమని, బ్యాంకులను లక్ష్యంగా చేసుకోవడం ఎక్కడా జరగలేదన్నారు. స్వయంగా మున్సిపల్ అధికారులే దగ్గరుండి చెత్త వేయించడం దారుణమని వారు తెలిపారు.