ఇద్దరూ ఒకరినొకరు ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరంటే మరొకరికి పంచప్రాణాలు.. కలిసి బతకాలని ప్రియురాలు కలలుగంటే, ప్రియుడు మాత్రం పెళ్లికి నిరాకరించాడు.. ప్రాణంగా చూసుకుంటాడనుకున్న ప్రియుడు పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో, తన ప్రియుడు వేరోకరిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ప్రియుడిని యువతి దారుణంగా హత్యచేసింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ ఎం.సురేష్ కథనం ప్రకారం తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు చూసి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.