పెళ్లికి ముందు ఆ అమ్మాయి వేరే అతనిని ప్రేమించింది.. ఇంట్లో చెప్పలేక, తల్లిదండ్రుల మాట కాదనలేక పెద్దలు తెచ్చిన సంబంధాన్ని ఓకే చేసుకుంది. పెళ్లి జరిగిందీ కాని ఆ పెళ్లి కూతురు మనసు మాత్రం తన ప్రియుడిపైనే ఉంది. ఆ ప్రియుడి జ్ఞాపకాలను మరిచిపోలేక పెళ్లైన 18 రోజులకే చెప్పా పెట్టకుండా ప్రియుడితో పారిపోయింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన మూర్తి రైక్వార్ అనే 20 ఏళ్ల యువతికి ఉత్తర ప్రదేశ్కు చెందిన రాహుల్ అనే వ్యక్తితో డిసెంబర్ 6న వివాహమైంది. కానీ అప్పటికే ఆమె భజ్జు యాదవ్ అనే అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. పెళ్లయినా కూడా అతడి తలపుల్లో నుంచి బయటకు రాలేకపోయింది. మరోవైపు పెళ్లి తర్వాత జరిగే తంతు కోసం నూతన వధువు పుట్టింటికి పంపించారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఆమె డిసెంబర్ 24న మెట్టినింటికి తిరుగు పయనమైంది. ఇక దొరికిందే ఛాన్సని భావించిన సదరు యువతి తన మెడలో మూడు ముళ్లు పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయి ప్రియుడితో పరారైంది. లక్షలు ఖరీదు చేసే బంగారు నగలు, డబ్బును కూడా వెంటపెట్టుకుని ఉడాయించింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన భార్య దారిలోనే ఎవరితోనే జంప్ అయిందని తెలుసుకున్న భర్త అమ్మాయి ఇంటికి వెళ్లి నానా గొడవ చేశారు. ఈ విషయం గురించి వధువు తండ్రి రామ్పాల్ మాట్లాడుతూ, కూతురు కోసం అల్లుడు గాలిస్తున్నాడని తెలిపాడు. ఆమె రూ.5 లక్షలు విలువ చేసే నగలతో పాటు, రూ.20 వేలు పట్టుకెళ్లిందని పేర్కొన్నాడు.