తమ ఇంటి ఆవరణలో అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న బొన్సాయి చెట్టును ఎవరో ఎత్తుకెళ్లారని, తన చెట్టు తనకు వెతికి పెట్టాలని మాజీ డీజీపీ అధికారి సతీమణి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 18లో నివాసం ఉంటున్న మాజీ డీజీపీవీ అప్పారావు ఇంటి ఆవరణలో పలు రకాలైన బొన్సాయి చెట్లు ఉన్నాయి. వాటిలో 15 సంవత్సరాల వయసు గల బొన్సాయి చెట్టును గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం అపహరించాడు. గుర్తించిన తోటమాలి దేవేందర్ తమ యజమానికి తెలియజేశాడు. దీంతో విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి శ్రీదేవి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చెట్టును అపహరించిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. మూడేళ్ల క్రితం కూడా మాజీ డీజీపీ ఇంట్లో ఒక బొన్సాయి చెట్టును అపహరించారు. ఏలాగైనా చెట్టును వెతికి పెట్టి దానిని దొంగిలించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొవాలని వారు అంటున్నారు. చెట్లు ప్రాణమని, వారిని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నామన్నారు.