
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన తొలిరోజు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమయిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్న కార్యకర్తలు వ్యాక్సిన్ సురక్షితమేనని, ఏలాంటి ప్రమాదం లేదని రుజువు చేశారని ఆయన పేర్కొన్నారు. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3,530 మందికి టీకా అందించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రెండు నెలలుగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఎంతో శ్రమించారని అన్నారు. కరోనాపై పోరాటంలో సీఎం కేసీఆర్ ముందుండి నడిపించారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వానికి డా.శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదని డా.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మూడున్నర వేల మందికి టీకా వేయిస్తే కేవలం 20 మందిలో మాత్రమే మైనర్ రియాక్షన్లు వచ్చాయన్నారు. టీకా తీసుకున్న చోట ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం లాంటివి జరిగాయని, అలాంటివాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్యాన్ని కొన్ని రోజలు పర్యవేక్షిస్తామన్నారు. టీకా తీసుకున్న 42 రోజుల తర్వాతే యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయని వివరించారు. మొదటి డోస్ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్ తీసుకోవాలని.. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మున్ముందు ప్రతి కేంద్రంలో వంద మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 104కు ఫోన్ చేసి వ్యాక్సిన్పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.