
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ మూసివేయబడ్డాయి. విద్యార్ధుల విద్యాసంవత్సరం వృధా కాకుండా ప్రభుత్వం ఆన్లైన్ విద్యను ప్రవేశపెట్టాయి. పలు ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు నడిపిస్తున్న ఆన్లైన్ క్లాసుల్లోకి ఆకతాయిలు జొరబడుతున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చొరబడడం మామూలైపోయింది. తాజాగా ఖైరతాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు. ఆమె తన విద్యార్థులకు ఆన్లైన్లో ఇంగ్లీషు పాఠం చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ క్లాసులోకి ప్రవేశిస్తున్నారు. అసభ్య, అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఆన్లైన్ క్లాసులో ఉన్న విద్యార్థుల్లో ఎవరో ఒకరి ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ సదరు ఆకతాయిలకు తెలిసి ఉంటాయని, అందులో ఆన్లైన్ క్లాస్లోకి జొరబడగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు.