
తన డ్యూటీ సమయం ముగిసిందని.. తాను ఇంకా పనిచేయలేనని ఒక పైలట్ ఏకంగా విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన పాకిస్తాన్లో జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన ఆ పైలట్, విమాన ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.
పాకిస్తాన్కు చెందిన PK-9754 విమానం జనవరి 16న సౌదీఅరేబియాలోని రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని సౌదీఅరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. తిరిగి ప్రయాణం కొనసాగించాల్సిన సమయానికి పైలట్ లలో ఒకరు తన షిఫ్ట్ టైం(పని సమయం) ముగిసిందని, విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్ళిపోయాడు. దీంతో కంగుతిన్న కో-పైలట్ విషయాన్నీ PIA యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు. ఇంతలో విమానంలోని ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని, తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిందే అంటూ పట్టుబట్టారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అప్రమత్తమై.. ప్రయాణికులకు సర్ది చెప్పారు. అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పాటు చేసి, పైలట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు. దీనిపై PIA సంస్థ ప్రతినిధి స్పందిస్తూ..పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని, తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.