తెలంగాణ‌లో పొగాకు ఉత్ప‌త్తులు అమ్ముకొవ‌చ్చు.. నిషేధం లేదు

Share On

తెలంగాణలో గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి నిషేధం అమలులో లేదని తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. గుట్కా క్రయవిక్రయాలు జరిపే వారిపై కేసు పెట్టే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది. పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించిందని స్పష్టం చేసింది. అందువల్ల గుట్కా ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయదారులపై కేసులు పెట్టడానికివీల్లేదని తెలిపింది.

పొగాకు ఉత్పత్తుల వ్యాపారం చేసే వారిని పోలీసులు వేధిస్తున్నారని.. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి తారానగర్‌కు చెందిన డి. నితేష్ కుమార్‌, మరో ఐదుగురు వ్యాపారులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గుట్కాను సీజ్ చేసే అధికారం లేనప్పటికీ.. పోలీసులు పదేపదే వేధింపులకు పాల్పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లలిత ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదనలను వినిపించిన న్యాయవాదులు.. కోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. గుట్కా, పాన్‌మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్‌ జారీచేసిందని .. ఐతే దానిని సవాల్‌ చేస్తూ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో మార్చి 31న గుట్కా నిషేధంపై కోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు. సుప్రీం స్టే విధించిన నేపథ్యంలో.. తెలంగాణలో పొగాకు ఉత్పత్తుల వ్యాపారంపై ఎలాంటి నిషేధం అమలులో లేదని స్పష్టం చేశారు. తమ వ్యాపారంలో జోక్యం చేసుకునే అధికారం లేనప్పటికీ పోలీసులు వేధిస్తున్నారని.. సరుకును సీజ్ చేసి, కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు.

హోంశాఖ తరపున వాదనాలు వినిపించిన న్యాయవాది.. గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం మరికొంత సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఐతే ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలే చెప్పారని.. మళ్లీ అదే వాదన వినిపించడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సైతం పార్టీగా ఉందనివ్యాఖ్యానించింది. కేసులు పెట్టిన ప్రతి పోలీసు అధికారి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలంటే సమయం సరిపోదని.. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసు అధికారులంతా పాటించేలా ఆదేశాలు జారీచేయాలని స్పష్టం చేసింది. పోలీసులు తమను వేధించకుండా చర్యలు తీసుకోవాలని.. జర్దా, పాన్‌మసాలా ఉత్పత్తి, వ్యాపారుల సంక్షేమ సంఘం డీజీపీకి వినతి పత్రం కూడా అందజేసిందని కోర్టు గుర్తుచేసింది. ఐనప్పటికీ పోలీసులు కేసులు పెడుతున్నారని.. కోర్టు ఆదేశాల అమలులో హోంశాఖ తీవ్రంగా విఫలమైందని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులపై నిషేధం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ.. పోలీసు అధికారులందరికీ సర్క్యులర్‌ జారీచేయాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. రెండు రోజుల్లో దీనిని జారీచేయని పక్షంలో.. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu