
దాదాపుగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో టీవీలు, మొబైల్ వాడకం తప్పనిసరి ఐపోయింది.. సాయంత్రం కాగానే టీవీలకు అతుక్కుపోతారు.. సీరియల్ చూస్తూ కాలక్షేపం చేస్తారు.. పనికి పోయిన వారు, ఇతర విద్యార్ధులు ఫోన్లతో ఎంజాయ్ చేస్తారు.. ప్రతి గ్రామంలో జరుగుతున్న తంతు ఇదే.. కాని ఒక గ్రామంలో మాత్రం రాత్రి ఏడు గంటలకు సైరన్ మోగుతోంది.. అక్కడ సైరన్ మోగగానే ప్రతి ఇంట్లో టీవీలు బంద్ అవుతాయి.. మొబైల్స్ స్విచ్చాప్ అవుతాయి.. అలా మారడానికి ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది..
మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్ మండలం మోహిత్యాంచె వడ్డావ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా ఓకే చెప్పేసి, అందరూ ఒకే మాట మీద ఉంటున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి అక్కడి పద్దతులు మారిపోయాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వేళ.. పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు సెల్ ఫోన్లు కొనిచ్చారు. అప్పటి నుంచి పిల్లల్లో మార్పు స్పష్టంగా కనిపించసాగింది. పుస్తకాలు పట్టుకోవటం మానేసి.. మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయటం షురూ చేశారు.
ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చినప్పటికి బడికి వెళ్లి వచ్చిన తర్వాత పిల్లలు పుస్తకాలు తీసి చదువుకునే కన్నా.. సెల్ ఫోన్తో బిజీ కావటం.. ఇంట్లోని వారు టీవీలతో కాలక్షేపం చేయటం ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితిని చూసిన ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే.. తన ఊరిని మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుందని భావించారు. పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందన్న భావనకు వచ్చిన ఆయన.. ఆగస్టు 15న ఆ ఊరు ప్రజలంతా కలిసి సమావేశమయ్యారు.
ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు టీవీలు.. సెల్ ఫోన్లు బంద్ చేయాలని తీర్మానించారు. అంతేకాదు.. ఆ నిర్ణయం అందరూ విధిగా పాటించేలా చూసేందుకు ప్రభుత్వ టీచర్లకు.. అంగన్ వాడీ కార్యకర్తలకు.. పంచాయితీ సభ్యులకు అప్పజెప్పారు. ఆ గంటన్నర పాటు.. టీవీలు బంద్ చేయటమే కాదు.. సెల్ ఫోన్లు పూర్తిగా బంద్ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో మొదట్లో కాసిన్ని ఇబ్బందులకు గురైనప్పటికీ.. ఇప్పుడు అందరికి అలవాటుగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడు రాత్రి 7 గంటలకు ఊళ్లో సైరన్ మోగిన వెంటనే.. టీవీలు బంద్ కావటం.. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావటమే కాదు.. పిల్లలు పుస్తకాల్ని ముందేసుకొని చదువుకోవటం మొదలైంది. ఈ ఆలోచన ఎన్ని గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తోంది.. మరిన్ని గ్రామాలు వారి బాటలో నడిచేలా సిద్దమవుతున్నాయి.