
ఏపీలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత త్వరలో ఏపీలో పర్యటిస్తానని ఆమె స్వయంగా ప్రకటించారు. ఏపీ బీఆర్ఎస్ నేతలు తాజాగా ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రావెల కిషోర్బాబు, పార్థసారథిలతో తన నివాసంలో కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం, సభ నిర్వహణపై నేతలతో కవిత చర్చించారు. విజయవాడ లేదా గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది. ఈ సభపై ఏపీ బీఆర్ఎస్ నేతలతో కవిత చర్చించారు. సభ నిర్వహణపై నేతలకు పలు కీలక సూచనలు చేశారు. అలాగే విజయవాడలో బీఆర్ఎస్ కార్యాయలం ఏర్పాటుపై కూడా చర్చించారు. ఏపీలో బీఆర్ఎస్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సభ్యత్వాన్ని ఎక్కువమంది తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఏపీ నేతలకు కవిత సూచించారు.
త్వరలోనే తాను ఏపీలో పర్యటిస్తానని నేతలకు కవిత స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతానని కవిత తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత కవిత ఏపీలో పర్యటించే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలు.. కవితను కలవడం, ఏపీలో పర్యటిస్తానంటూ ఆమె పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకునే బాధ్యతలను కవితకు సీఎం కేసీఆర్ అప్పగించారా అనే చర్చ జరుగుతోంది.