
పెళ్లి సందడితో పెళ్లి మండపం సందడి, సందడిగా మారిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడికి గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణంలోని రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన సత్యనారాయణాచారి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఉట్నూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణాచారి మృతిచెందాడు. పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో వరుడి మృత్యువాతతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.