
పెళ్లి జరిగిన నాలుగేళ్ల తర్వాత తన భార్య మేజర్ కాదంటూ ఆ వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త కోర్టుకెళ్లాడు.. ఆరేళ్ల తర్వాత పెళ్లి రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీనిపై బాధితురాలు హైకోర్టుకు వెళ్లగా.. ఆ వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తాజాగా స్పష్టం చేసింది. ఆ వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం కొట్టివేసింది.
కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన సుశీల- మంజునాథ్ల వివాహం 2012 జూన్ 15న జరిగింది. వివాహ సమయానికి తన భార్య వయసు 18 ఏళ్లు నిండలేదని నాలుగేళ్ల తర్వాత మంజునాథ్ గుర్తించారు. ఆ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టుకెళ్లడంతో.. ఆయన వినతిని పరిగణనలోకి తీసుకుని విచారించిన న్యాయస్థానం గత ఏడాది ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుశీల హైకోర్టుకెళ్లడంతో.. విచారణ పూర్తి చేసిన జస్టిస్ అలోక్ ఆరాధె, జస్టిస్ విశ్వజిత్ల పీఠం ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఇన్నేళ్లు కాపురం చేశాక అప్పటికి మైనర్ అనే కారణంగా పెళ్లిని రద్దు చేయలేమని తేల్చింది.