కెసిఆర్ హెచ్చ‌రించినా ఎమ్మెల్యెలు మార‌ట్లేదా..

Share On

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరిపడుతున్నాయి.. ఎలాగైనా గెలుపు సాధించాలని ఎవరి వ్యూహాలు వారు ముందుకు వెళుతున్నారు. కాని బీఆర్ఎస్ పార్టీలో మాత్రం గొడవలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎంఎల్ఏల వైఖరితో నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో పార్టీలో కూడా వివాదాలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయి. సంక్షేమపథకాలు అభివృద్ధిపథకాల అమలులో ఎంఎల్ఏల జోక్యం పెరిగిపోతోందని అవినీతి పెరిగిపోతోందని అధినేత కేసీఆర్ స్వయంగా హెచ్చరించినా ఎవరు పట్టించుకోవటంలేదు. తమకు దక్కాల్సిన పర్సంటేజీలు దక్కాల్సిందే అన్నట్లుగా కొందరు ఎంఎల్ఏలు వ్యవహరిస్తున్నారట. ఈమధ్య పార్టీ సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు 45 మంది ఎంఎల్ఏలు వివిధ రకాల అవినీతిలో కూరుకుపోయినట్లు స్వయంగా ప్రకటించారంటే పరిస్థితి ఏలా ఉందో తెలుసుకొవచ్చు.

119 నియోజకవర్గాల్లో 45 మంది ఎంఎల్ఏలు అవినీతిపరులని స్వయంగా కేసీఆర్ చెప్పటం సంచలనంగా మారింది. కేసీఆర్ చెప్పిన లెక్క ఎంఎల్ఏలు మాత్రమే. మరి మంత్రుల పరిస్ధితి ఏమిటి ? ఇక్కడ సమస్య ఏమిటంటే మంత్రులు ఎంఎల్ఏలు ఎంపీలు ఎంఎల్సీలను కేసీఆర్ విచ్చలవిడిగా వదిలేశారు. అందుకనే ఎవరికి దొరికిన చెరువులు ప్రభుత్వ భూములను వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. చివరకు ప్రైవేటుస్ధలాలను కూడా వదలడంలేదు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దుర్గం చిన్నయ్య లాంటి ఎంఎల్ఏల మీద ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. ముత్తిరెడ్డి మీదైతే ఆయన కూతురే పోలీసులకు ఫిర్యాదుచేసింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ఒక్కటే పార్టీకాదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్స. బీజేపీతో పాటు చిన్నా చితకా పార్టీలు చాలానే ఉన్నాయి. పైగా బీజేపీ లాంటి పార్టీలకు చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేరు. అందుకనే కేసీఆర్ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఏదో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీచేయవచ్చనే ధీమా ఎంఎల్ఏల్లో పెరిగిపోయింది.

అందుకనే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరికలను కూడా చాలామంది లెక్కచేయటంలేదు. నిజానికి కేసీఆర్ కుటుంబం మీదే లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తన కుటుంబం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటు ఎదుటివారిని అవినీతికి దూరంగా ఉండమంటే ఎవరుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా 111 జీవో ఎత్తివేతపైన కూడా కేసీఆర్ పైనే చాలా ఆరోపణలున్నాయి. గెలుపు కోసం కెసిఆర్ ఎంతమందికి టికెట్లు ఇస్తారో, టికెట్ల్ రాని వారు ఎటు వైపు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. బిఆర్ఎస్ పార్టీకి ఈ సారి గడ్డుకాలం తప్పేలా లేదు..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu