
గత రెండు రోజుల నుంచి జార్ఖండ్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎస్డీఆర్ఎఫ్ విభాగం తెలిపింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. జార్ఖండ్లో బలమైన ఈదురుగాలులు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం జంషెడ్పూర్లో 79 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బొకారోలో 52 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఉత్తర బీహార్, ఉత్తర ఒడిశా నుంచి హర్యానా నుంచి సిక్కిం వరకు అల్పపీడన ద్రోణి కారణంగా జార్ఖండ్లో పిడుగుల వాన కురిసిందని రాంచీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఇంట్లో తలదాచుకోవాలని సూచించారు. పిడుగులు పడే సందర్భంలో స్తంభాలు, వంతెనలు, చెరువులు, రిజర్వాయర్లు, స్విమ్మింగ్ పూల్స్ వైపు వెళ్లకూడదని చెప్పారు.