
శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్-2023ను ఇండియా సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఎనిమిదోసారి ఆసియాకప్ను దక్కించుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) శ్రీలంక బ్యాటింగ్ వెన్ను విరగొట్టిన వేళ 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు శుభ్మన్ గిల్ (27; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23; 18 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ కోల్పోకుండా భారత్ను విజయ తీరాలకు చేర్చారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల దెబ్బకు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు. ఇదే క్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్లో అతడికిదే బెస్ట్ బౌలింగ్ కావడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు డకౌట్గా పెవిలియన్కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన పరుగులేమీ చేయలేదు. మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చివర్లో దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు ఆమాత్రమైనా చేయగలిగింది. దీంతో భారత్ ఎదుట 51 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. సిరాజ్ 6 వికెట్లు.. హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఒక వికెట్ తీశారు.