
న్యాయవాద వృత్తిలో మన అంతరాత్మనే మనకు కీలకమని, దీనిని కుదురుగా నిలబెట్టుకుంటేనే మనకు సరైన రీతిలో కునుకు పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. ఎవరినైనా మనం మోసగించవచ్చు అందుకు సిద్ధపడవచ్చు, అయితే అంతర్మాతను ఎవరూ మోసగించుకోలేరని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లాయర్లు, జడ్జిల మధ్య ఆదరణ అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్ఠం చేశారు.
న్యాయవాద వృత్తికి విశ్వసనీయత సమగ్రత కీలకం అని, మన ఆచరణను బట్టి ఈ వృత్తిలో మనం రాణిస్తాం లేదా చేజేతుల్లా దెబ్బతీసుకుంటామని స్పందించారు. ఎంతకాలం అయితే మనం నిబద్ధతను పాటిస్తామో అంతవరకూ ఈ వృత్తిలో ఎదుగుదల ఉండనే ఉంటుందన్నారు. న్యాయ వ్యవస్థ పటిష్టం దిశలో లాయర్లు, జడ్జిల పట్ల మరింత సహకారం అనే అంశంపై సిజెఐ ప్రసంగించారు. న్యాయవాద వృత్తి విశ్వసనీయతకు సంబంధించింది అన్నారు. మనం చేసే చిన్నచిన్నతప్పులు, సర్దుబాట్లు, రాజీల బాటలతోనే చివరికి మనకు మనం దీనిని పూర్తిగాదెబ్బతీసుకుంటామని, ఇది కేవలం లాయర్లకే కాకుండా జడ్జిలకు కూడా వర్తిస్తుందని వివరించారు.