
యువత ఆలోచన పెరుగుతుంది.. నేటి యువత ఒంటరిగా బతకడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ రాకతో వర్చువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్ఫ్రెండ్స్ అనూహ్యంగా పెరుగుతున్నారు. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒరవడి యువతలో ఒంటరితనాన్ని మరింత పెంచుతున్నదని పేర్కొంటున్నారు. ఏఐ గర్ల్ఫ్రెండ్స్ అందుబాటులోకి రావడంతో పురుషుల ఒంటరితనాన్ని మరింత దిగజార్చుతున్నదని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్ లిబర్టీ విటెర్ట్ హెచ్చరించారు.
ఆమె తన క్లాస్లోని 18 ఏండ్ల స్టూడెంట్స్ను మీరు ఏ సోషల్ మీడియా యాప్ వాడుతున్నారని అడగ్గా ఒక విద్యార్ధి తనకు ఏఐ గర్ల్ఫ్రెండ్ ఉందని చెప్పడంతో షాక్కు గురైంది. అతడు ఈ విషయం గురించి బాహాటంగా చెప్పడంతో ఆశ్చర్యానికి లోనయ్యానని ప్రొఫెసర్ విటెర్ట్ చెప్పుకొచ్చారు. ఏఐ గర్ల్ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వాటిగురించి బాహాటంగా వెల్లడించేంతగా ప్రధాన స్రవంతిలోకి వచ్చాయని చెప్పారు. వర్చువల్ గర్ల్ఫ్రెండ్స్ మీతో ముచ్చటిస్తూ, ప్రేమిస్తూ, పర్ఫెక్ట్ రిలేషన్షిప్ను క్రియేట్ చేసే పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
ప్రముఖ యాప్ రెప్లికాకు కోటి యూజర్లు ఉండగా వీరిలో 35 శాతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో పెరిగారు. యూజర్లు ఏఐ పార్ట్నర్స్తో ప్రేమలో మునగడం, రిలేషన్షిప్స్లో ఉండటంతో పాటు వారిని వివాహం కూడా చేసుకుంటున్నారని రెప్లికా పేర్కొంది. ఏఐ గర్ల్ఫ్రెండ్స్ మీ అవసరాలన్నీ తీరుస్తాయని, రియల్ రిలేషన్షిప్లో ఉండే ఎగుడుదిగుళ్లు ఉండకపోవడంతో పురుషులకు ఇవి పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్గా మారుతున్నాయని ప్రొఫెసర్ విటెర్ట్ పేర్కొన్నారు. ఈ ధోరణి యువతతో పాటు పురుషుల ఒంటరితనాన్ని మరింత దిగజారుస్తున్నాయని దీన్ని మహమ్మారిగా అభివర్ణిస్తూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం పురుషుల్లో సింగిల్స్ను పెంచేస్తుందని, అమెరికాలో బర్త్ రేట్స్పై ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ పేర్కొన్నారు.