
పాకిస్తాన్లోని కరాచీ నగరానికి చెందిన హాజీ బలోచ్ అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో కలిసి సమీపంలోని అరేబియా సముద్రంలో సోమవారం చేపల వేటకు వెళ్లాడు. అయితే అనూహ్యంగా హాజీ బలోచ్ వలకు అరుదైన చేప చిక్కింది. అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ను స్థానికంగా ‘సోవా’ అని పిలుస్తారు. ఈ చేప మెంతుల రంగులో ఉంటుంది. ఈ చేపలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని, పలు వ్యాధుల నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని స్థానిక ప్రజల నమ్మకం. శుక్రవారం కరాచీ నౌకాశ్రయంలో వీటిని వేలం వేయగా పాక్ కరెన్సీలో దాదాపుగా 70 మిలియన్ రూపాయలకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ఈ మేరకు పాకిస్తాన్ ఫిషర్ మెన్ ఫోక్ ఫోరమ్కి చెందిన ముబారక్ ఖాన్ మీడియాకు వెల్లడించారు.
సోవా చేప ప్రత్యేకత
సోవా రకం చేపలు చాలా విలువైనవి, అరుదైనదిగా పరిగణిస్తారు. దాని కడుపు నుంచి విడుదలయ్యే పదార్ధాలను అనేక వ్యాధుల చికిత్స కోసం మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చేప నుండి లభించే దారం వంటి పదార్థాన్ని శస్త్రచికిత్సలో ఉపయోగిస్తారు. ఇది చాలా విలువైన చేప అని, ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉందని హాజీ బలోచ్ తెలిపారు. ఈ జాతి చేపల బరువు 20 నుంచి 40 కిలోల మధ్య ఉంటుంది. దీని పొడవు 1.5 మీటర్ల వరకు ఉంటుంది. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంది.
హాజీ బలోచ్ మాట్లాడుతూ.. కరాచీకి దూరంగా ఉన్న సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లాను. అయితే నాకు గోల్డెన్ ఫిష్ దొరికింది. ఇది నాకు ఊహించనిది. వేలంపాట ద్వారా వచ్చిన సొమ్మును నా టీంలోని ఏడుగురం సమానంగా పంచుకుంటామని హాజీ బలోచ్ చెప్పాడు. ఈ రకం చేపలకు ఔషధ గుణాలు ఉండటమే కాకుండా సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత చాలా ఉంది. సాంప్రదాయ ఔషధాలే కాకుండా, సాంప్రదాయ స్థానిక వంటకాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఈ చేపలు సంతానోత్పత్తి కాలంలో మాత్రమే తీరానికి చేరుకుంటాయని హాజీ బలోచ్ చెప్పుకొచ్చాడు.