
ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి.. అందరినీ నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం యావత్ దేశం ఎంతో ఆతృతతగా ఎదురు చూసిన విజయం దక్కలేదు. దీంతో క్రికెట్ అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ ఈసారి కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే టీమిండియా పరాజయం పొందినా.. దేశ ప్రజల నుంచి మద్ధతు పెద్ద ఎత్తున లభిస్తోంది. ప్రపంచకప్లో అద్భుత ఆటతీరును కనబరిచిన రోహిత్ సేనకు దేశ ప్రజలు అండగా నిలిచారు. టీమిండియాకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్లేయర్స్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు తనవంతు ప్రయత్నించారు.
ఫైనల్లో టీమిండియా ఓటమిపై ట్విట్టర్ వేదికగా మోడీ స్పందించారు. ఈ విషయమై ప్రధాని ట్వీట్ చేస్తూ.. ‘డియర్ టీమ్ఇండియా, ప్రపంచకప్లో మీ ప్రతిభ, సంకల్పం మర్చిపోలేనివి. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వపడేలా చేశారు. ఈరోజు, ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాం’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రస్సింగ్ రూమ్లో టీమిండియా ప్లేయర్స్ను ప్రధాని మోడీ కలిశారు.
ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెన్నుతట్టారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన జడేజా.. ‘మేము ఈ ప్రపంచకప్లో మంచి ఆటతీరును కనబరిచాము. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయాము. మేమంతా ఓటమి బాధలో ఉన్నాము. కానీ దేశ ప్రజల మద్ధతు మాకు కొనసాగుతూనే ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించడం ప్రత్యేకంగా అనిపించింది, మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది’ అని రాసుకొచ్చారు.