సోషల్ మీడియాలో ఆలోచన రెకెత్తించే పోస్టులు ఉండాలి కాని రెచ్చగొట్టే విధంగా ఎవరూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసినా కఠినచర్యలు తప్పవని, గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయా పోస్టులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు మహేందర్రెడ్డి సూచించారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్స్టేషన్కు తెలియజేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నేతల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సుమారు 50 మందిపై ఈ తరహా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీటిపై న్యాయసలహా తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని డీజీపీ మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.