దేశంలో ఆరు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని, ఈ చలికాలంలో వైరస్ వ్యాప్తి రోజురోజుకు క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. శుక్రవారం ఒక్కరోజే 41,452 కొత్త కేసులు, 615 మరణాలు నమోదయ్యాయి. కరోనా తీవ్రత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్గఢ్లలోనే అధికంగా కేసులు నమోదైనట్లు చెప్పారు. తాజాగా మహారాష్ట్రలో 6185 కొత్త కేసులు రాగా.. దిల్లీలో 5482, కేరళలో 3966 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం కూడా రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 11,57,605 మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,161 టెస్టింగ్ ల్యాబోరేటరీల్లో (1,175 ప్రభుత్వ, 986 ప్రైవేటు ల్యాబ్లు) 13.82 కోట్ల మందికి పరీక్షలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి మిలియన్ జనాభాకు గాను లక్ష టెస్ట్ల మార్కును దాటింది. ప్రతి మిలియన్ జనాభాలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ జాతీయ సగటు కన్నా 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి. అలాగే, 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా తక్కువగా నమోదైంది.